Nara Lokesh : చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తాం : నేతన్నలకు లోకేశ్ హామీ

by Disha Web Desk 21 |
Nara Lokesh : చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తాం : నేతన్నలకు లోకేశ్ హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన కారణంగా చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయింది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం రథసారథి నారా లోకేశ్ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 60మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడగా, వారికి పరిహారం అందించకపోగా కనీసం పరామర్శించలేదు అని ఆరోపించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జగన్నాథ ఆలయ సమీపంలో చేనేత కార్మికులు నారా లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ‘చేనేతల కుటుంబ సభ్యులకు గుర్తింపు కార్డులు మంజూరుచేసి, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. చేనేత వస్త్రాలపై 5శాతం జిఎస్టీ ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలి.

చేనేత సొసైటీలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలి. ఎన్టీఆర్ హయాంలో మాదిరి జనతా వస్త్రాల పంపిణీ చేపట్టి చేనేత వస్త్రాలను కొనుగోలుచేయాలి. నేతన్న నేస్తం కార్యక్రమాన్ని మగ్గం నేసే కార్మికులతోపాటు అనుబంధ చేత కార్మికులకు కూడా వర్తింపజేయాలి. చేనేత కార్మికులకు చంద్రన్న బీమా కల్పించి ఆదుకోవాలి. చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయాలి. నర్సాపురం వీవర్స్ కాలనీ 25వవార్డుకు సంబంధించి ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్లస్థలాలకు పట్టాలు ఇప్పించాలి. గతంలో మాదిరి గాంధీ యువజన పథకం కింద 8వతరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలకు స్కాలర్ షిప్ లు ఇప్పించాలి’ అని చేనేత కార్మికులు లోకేశ్‌ను కోరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ...టీడీపీ హయాంలో చేనేత కార్మికులకు రూ.110కోట్ల రుణమాఫీ చేసి ఆదుకున్నాం అని గుర్తు చేశారు. చేనేత కార్మికులకు గుర్తింపుకార్డులు అందజేసి సంక్షేమపథకాలన్నీ అందించేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.

చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుచేసేలా కేంద్రంతో మాట్లాడతామని..వీలుపడకపోతే రాష్ట్రమే జీఎస్టీ భరించేలా చేస్తాం అని పేర్కొన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం అని భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులకు చంద్రన్న బీమా, ఆరోగ్య బీమా పథకాలను వర్తింపజేస్తామన్నారు. 25వవార్డు ఎన్టీఆర్ కాలనీ వాసులకు పట్టాలు అందజేస్తాం. చేనేత కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లు లేని చేనేత కార్మికులు ఇళ్లు నిర్మించడంతో పాటు కామన్ వర్క్ షెడ్లు నిర్మిస్తాం అని లోకేశ్ చేనేత కార్మికులకు హామీ ఇచ్చారు.

Read More: తుది దశకు టీడీపీ అభ్యర్థుల ఖరారు.. ప్రకటన అప్పుడే!

తండ్రి చంద్రబాబు రికార్డును బ్రేక్ చేసిన లోకేశ్



Next Story

Most Viewed